తిరుమల : తిరుమల ( Tirumala) తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఈనెల 24, 25వ తేదీల్లో ఘనంగా జరుగనుంది. తీర్థానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ (TTD) విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. మొదటి రోజు తీర్థానికి వచ్చే భక్తులకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రెండో రోజు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని సంబంధిత అధికారులు వివరించారు.
పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందిస్తామని వెల్లడించారు. తీర్థం ప్రాంతానికి వచ్చే భక్తులకు గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉంటే వారికి అనుమతి లేదన్నారు. భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ సూచించింది.
ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahamotsavam) ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 23న సీతారాముల కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఏప్రిల్ 26న శ్రీ రామపట్టాభిషేకం జరుగుతుందని పేర్కొన్నారు.