తిరుమల : భక్తులే తమ ఆరాధ్యదైవం అంటూ టీటీడీ (TTD) ఉద్యోగులు అంకితభావంతో యాత్రికులకు సౌకర్యవంతమైన సేవలందించాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అన్నారు. తిరుమల గోకులం విశ్రాంతి గృహం ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు (Devotees ) టీటీడీ ఉద్యోగులు మెరుగైన సేవలందించి, ప్రతి భక్తుడు మధుర స్మృతులతో తిరిగి వెళ్లేలా చూడాలని పిలుపునిచ్చారు.
శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించేందుకు ఆలయం వెలుపల నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో (High Security ) ఏర్పాటుచేసినట్లు చెప్పారు. పరకామణిని మరింత సులభతరం చేసేందుకు కాయిన్స్ వేరుచేసే మిషన్, కరెన్సీ కౌంటింగ్, ప్యాకింగ్ మిషన్లు త్వరలోనే వస్తాయన్నారు. టీటీడీ అన్నదానం ట్రస్టు ద్వారా ప్రతి రోజు 2 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నామన్నారు. తిరుమలలో వసతి గదులు నిర్మించి దాదాపు 40 సంవత్సరాలు అయ్యిందని రూ.120 కోట్లతో భక్తులకు అవసరమైన అత్యాధునిక సౌకర్యాలతో వీటిని ఆధునీకరించినట్లు తెలిపారు.
తిరుమలలో మరో 10 వేల మంది శ్రీవారి భక్తులకు వసతి సౌకర్యాన్ని కల్పించేందుకు రూ.100 కోట్లతో పిఏసి 5 నిర్మాణం ప్రారంభించినట్లు చెప్పారు. నడక మార్గాల్లో క్రూరమృగాల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేడుకల్లో ఎస్ఈ – 2 ,జగదీశ్వర్రెడ్డి, విజివోలు బాలిరెడ్డి, గిరిధర్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, సెల్వం, రాజేంద్ర, ఈఈ సురేందర్ రెడ్డి, డీఈ ఎలక్ట్రికల్ రవిశంకర్ రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.