తిరుపతి : ఉత్తరద్వార దర్శనం తిరుమలలో ఈ నెల13 నుంచి 22 వ తేదీ వరకు జరగనున్నది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి లో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టికెట్లు పొందిన భక్తులు ముందురోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మాత్రమే అలిపిరి నుంచి తిరుమలకు అనుమతిస్తామని చెప్పారు.
తిరుపతి లోని రామచంద్రపుష్కరిణి, ముత్యాలరెడ్డి పల్లె, సత్యనారాయణ పురం జిల్లా పరిషత్ పాఠశాలలు, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు మాత్రమే ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామన్నారు. టికెట్ల కోసం వచ్చే భక్తులు క్యూ లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.