తిరుపతి : దేశంలో యూజీసీ గుర్తింపు ఉన్న ఏకైక శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం(Veda University) సేవలు ఉత్తర భారత దేశంలోనూ విస్తరించాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన వేద విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, హిందూ ధర్మప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వెల్లడించారు.
రుషికేష్(Rushikesh) లో వేద విశ్వవిద్యాలయం సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న వేద పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. వేద వర్సిటీలో పురాణ ప్రవచనం, యోగ, ధ్యానం అంశాల్లో ప్రత్యేకంగా సర్టిఫికెట్ కోర్సు(Certificate Courses) లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు వివరించారు. కరోనా కారణంగా వర్శిటీలో నిలిపి వేసిన ఆదర్శ వేద గురుకుల విద్యను పునః ప్రారంభించనున్నామన్నారు.
టీటీడీ ఉద్యోగుల లాగే వేదిక్ వర్సిటీ రెగ్యులర్ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 40 మంది విద్యార్థులకు పీహెచ్డీ ప్రవేశాలు కల్పించడానికి అనుమతించినట్లు వెల్లడించారు. ప్రతి పౌర్ణమి రోజు తెలుగురాష్ట్రాలోని 59 ముఖ్య ఆలయాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని నిర్ణయించామన్నారు. శ్రీనివాస వ్రతం ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, టీటీడీ బోర్డు సభ్యులు రాములు, మల్లేశ్వరి, వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి పాల్గొన్నారు.