Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయబోతున్నది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని చెప్పింది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుంచి 22న మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరు కానున్నాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నది. శ్రీవారి సేవ(తిరుమల-తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల ఆగస్టు నెల కోటాను జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. భక్తులందరూ ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.