హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): దేశంలోని పీఠాధి, మఠాధిపతులు, స్వామీజీల సూచనలు, సలహాల ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక ప్రచారం చేస్తుందని తిరుమల పెద్దజీయర్స్వామి వెల్లడించారు. తిరుమలలో నిర్వహిస్తున్న వేంకటేశ్వర ధార్మిక సదస్సు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా పెద్దజీయర్స్వామి మాట్లాడుతూ.. శ్రీవారి చెంత ధార్మిక సదస్సు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.
ప్రస్తుత సదస్సు ద్వారా తిరిగి ధార్మిక కార్యక్రమాలను వేగవంతం చేస్తారని చెప్పారు. చినజీయర్స్వామి మాట్లాడుతూ.. పూర్వయుగాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మోక్షం లభించలేదని, కలియుగంలో నామసంకీర్తన చేస్తే చాలు భగవంతుని కృప కలుగుతుందని పేర్కొన్నారు. భగవన్నామస్మరణతో భక్తులు తమ కష్టాలను దూరం చేసుకుని, ముక్తి మార్గం వైపు పయనించవచ్చని సూచించారు.
తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా భగవంతుడిని, సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి స్పష్టంచేశారు. ధార్మిక సదస్సులో స్వామీజీలు అందించే సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని సనాతన హైంధవ ధర్మం పరిఢవిల్లేలా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. సదస్సులో ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.