తిరుమల : శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ. 15,938 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని వెల్లడించింది. 10,258.37 కిలోల బంగారం బ్యాంకుల్లో నిల్వ ఉందని తెలియజేసింది. శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు ఈవో ధర్మారెడ్డి వివరాలు ప్రకటించారు. మెచ్యూరిటీ పూర్తయిన డిపాజిట్లను అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టామని తెలియజేసింది.
కాగా గడిచిన మూడేళ్లలో స్వామివారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగాయి. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ. 15,938 కోట్లకి డిపాజిట్లు చేరుకున్నాయి. 2019 నాటికి 7,339.74 కేజీలు ఉండగా ప్రస్తుతం 10.258.37 కేజీల బంగారం నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది.
టీటీడీ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుందన్న ప్రచారం అవాస్తవమని ఈవో కొట్టి పారేశారు. స్వామివారి నగదు, బంగారం నిల్వలు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు ఎప్పుడూ పెట్టదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.