Tirumala | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ డిప్ కింద కేటాయించే టికెట్ల కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. టికెట్లు పొందిన భక్తులు 21 నుంచి 23న మధ్యాహ్నం 12గంటల లోపు డబ్బులు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని దేవస్థానం బోర్డు చెప్పింది.
22న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పింది. అదే రోజున మధ్యాహ్నం 22 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని చెప్పింది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వివరించింది.
ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది. తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని చెప్పింది. శ్రీవారి సేవ(తిరుమల-తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులందరూ ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.