అమరావతి : కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీగురురాఘవేంద్ర స్వామివారి 350వ ఆరాధనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. టీడీడీ తరపున అదనపు ఈఓ ఏవీధర్మారెడ్డి మంగళవారం ఉదయం రాఘవేంద్రస్వామికి శ్రీవారి శేషవస్త్రం సమర్పించారు. మఠాధిపతి శ్రీసుబుదేంద్రతీర్థ స్వామికి అదనపు ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి ఆలయం ఓఎస్డీ పాల శేషాద్రితో కలిసి స్వామివారి శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీసుబుదేంద్రతీర్థ స్వామి వారికి ఆశీర్వచనం అందజేశారు. హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్ భాగవత సేవల దృష్ట్యా 2006 నుంచి శ్రీరాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టీటీడీ సమర్పిస్తున్నది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపతో శ్రీరాఘవేంద్రస్వామివారు జన్మించారని ప్రతీతి. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.