తిరుమల : తిరుమలలో నో ఫ్లైజోన్ హెచ్చరికలు ఉన్నప్పటికి కొంత మంది డ్రోన్ల సహాయంతో చేస్తున్న దృశ్యాల చిత్రీకరణనను పూర్తిగా అడ్డుకునేందుకు టీటీడీ సీరియస్గా దృష్టిని సారించింది. ఇందులో భాగంగా చిన్నపాటి మైక్రో డ్రోన్లను కూడా తక్షణమే గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నావల్ యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్ఏడీఎస్)ను తిరుమలలో ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలుపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)తో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భక్తులు డిపాజిట్ చేసిన లగేజిని సురక్షితంగా భద్రపరిచి తిరిగి అప్పగించేందుకు విమానాశ్రయాల తరహాలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. ఇందుకోసం ఆర్ఎఫ్ఐడీ ట్యాగులు వినియోగిస్తామని, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి ఈ వ్యవస్థ అమల్లోకి రానుందన్నారు.
దేశవ్యాప్తంగా 396 టీటీడీ కల్యాణ మండపాలు ఉన్నాయని, భక్తుల కోరిక మేరకు వీటిలో 12 కల్యాణ మండపాలను రూ.2.8కోట్లతో పూర్తిగా పునరుద్ధరించి, ఏసీ, ఫర్నీచర్ వసతులు కల్పించామని, తదనుగుణంగా మాత్రమే అద్దె పెంచామని ఈఓ వివరించారు. మిగిలిన 384 కల్యాణ మండపాల అద్దె పెంచలేదన్నారు.
టాటా సంస్థ అందించిన రూ.150 కోట్ల విరాళంతో తిరుమలలో ప్రపంచ స్థాయి మ్యూజియం ఏర్పాటు చేయనున్నామని, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. తెలిపారు. అదేవిధంగా, రూ.50 కోట్లతో హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిని అభివృద్ధి చేస్తున్నామని, రూ.23 కోట్లతో నూతన పరకామణి భవనం నిర్మించామని తెలియజేశారు.