తిరుపతి : వైకుంఠద్వార దర్శనం టోకెన్లను ఓర్పుతో, అంకితభావంతో భక్తులకు అందజేయాలని తిరుపతి (Tirupati)లోని కౌంటర్లలో విధులు కేటాయించిన నోడల్ అధికారులకు, సిబ్బందికి జేఈవో సదా భార్గవి (Sadabhargavi) సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో గురువారం 4వందల మంది డిప్యుటేషన్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనం (Vaikunta Dwara Darsan) కోసం దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు నాలుగు లక్షలకుపైగా టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని కోరారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు తదితర సౌకర్యాలను ఆయా కేంద్రాల్లోని నోడల్ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
భక్తుల ఆధార్ కార్డును (Aadhar Card)ధ్రువీకరించుకుని తేదీల వారీగా వరుస క్రమంలో టోకెన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. తేదీలు, స్లాట్లు మార్చుకునే అవకాశం లేదని వివరించారు. తహసీల్దార్లు, పోలీసులు క్యూలైన్లలో భక్తులను క్రమబద్దీకరిస్తారని తెలిపారు. మొత్తం టోకెన్లు పూర్తయ్యే వరకు అన్ని కౌంటర్లలో నిరంతరాయంగా జారీ చేస్తారని చెప్పారు. అనంతరం ఐటీ జిఎం సందీప్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టోకెన్ల కేటాయింపు విధానాన్ని వివరించారు.