తిరుపతి : కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి మహానీయులు పయనించిన బాటలో తిరుమలకు చేరుకుంటే మోక్షం లభిస్తుందన్న నమ్మకంతో తిరుపతి అలిపిరి మెట్ల వద్ద నిర్వహించే మెట్లోత్సవాన్ని బుధవారం వైభవంగా ప్రారంభించారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, శ్రీనివాసులు కలిసి మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు .
ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పూర్వం పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, కృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు.
ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.