తిరుమల : శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో కొండ చరియలు విరిగిపడి ఘాట్రోడ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. శనివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన టీటీడీ బోర్డు సమావేశం నిర్ణయించారు. భవిష్యత్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తిరుమల కొండకు మూడో ఘాట్ రోడ్ నిర్మించాలని, బాలపల్లి నుంచి తిరుమల అన్నమయ్య మార్గాన్ని ఘాట్ రోడ్ చేయాలని, అక్కడే మరో నడకమార్గం కూడా నిర్మించాలని, అందుకు కావాలిసిన అంచనాలు రూపొందించాలని చైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో భక్తుల రాకపోకలు జరిగేలా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.
హనుమ జన్మస్థలమైన ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి సలహాలు తీసుకోవాలని, ఎక్కడా లేని విధంగా భారీగా హనుమ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. శైశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టాలని, రూ.3కోట్లతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు, 10కోట్లతో స్విమ్స్లో భవనాలు నిర్మాణం, రూ.12 కోట్లతో మహిళా యూనివర్సిటీలో హాస్టల్ భవనాల నిర్మాణం చేపట్టాలని తీర్మానించింది. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభించి 10రోజుల పాటు దర్శనం కల్పిస్తామని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యం కల్పిస్తామని తెలిపారు.
నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపాన్ని నిర్మిస్తామని అన్నారు. వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కొట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పున:నిర్మిస్తామని అన్నారు. ఐటీ విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు చేస్తామని వెల్లడించారు.కల్యాణకట్ట క్షురకులకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచామని సుబ్బారెడ్డి వివరించారు.