తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఆలయంలోని పోటు, యాగశాల, కల్యాణ కట్ట, మరుగుదొడ్లు, కార్యాలయం, ఇతర అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. స్వామివారి పుష్కరిణి అభివృద్ధి, ఆలయ ప్రహరీ గోడ మరమ్మత్తులు చేయాలన్నారు. జలపాతం నుంచి నీటి ప్రవాహం బయటకు వెళ్లే మార్గంలో గోడలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
స్వామివారికి నూతనంగా తయారు చేస్తున్న చెక్క రథం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సంప్రోక్షణ నిర్వహించేందుకు త్వరిత పనులు పూర్తి చేయాలని , ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇంజినీరింగ్, ఆరోగ్య విభాగం వ్యర్థాలను తొలగించి, పచ్చదనాన్ని పెంపొందించి సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం లో జేఈవో దంపతులు పాల్గొన్నారు.