తిరుమల: తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టికెట్లను ప్రకటించిన దానికంటే ముందుగానే టీటీడీ (TTD) పంపిణీ చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో శుక్రవారం రాత్రి నుంచే టోకెన్లను జారీచేస్తున్నది. తొలుత వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని ప్రటించింది. అయితే భక్తులు పోటెత్తడంతో దర్శనానికి ఇబ్బందులు కలుగుతాయని భావించిన టీటీడీ టికెట్లు ఉన్నవారినే క్యూలైన్లలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. దీంతో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల కోసం ప్రత్యేక రంగుల్లో టికెట్లను ముద్రించింది. ఇప్పటికే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది.
శనివారం నుంచి జనవరి 1 వరకు శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శనం కల్పించనున్నారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరచుకోనున్నది. రోజుకు 80 వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. కాగా, శ్రీవారి సర్వదర్శనంపై గందరగోళం నెలకొన్నది. ఉదయం నుంచి సర్వదర్శనానికి భక్తులకు అనుమతించడంలేదు. 31 కంపార్టుమెంట్లు నిండిపోవడంతో టికెట్లు లేని భక్తులను క్యూలైన్లలోకి అధికారులు వదలడం లేదు. దీంతో ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు.