తిరుపతి : టీటీడీ వెబ్సైట్ ( TTD Website ) లో స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాల సమాచారం అప్లోడ్ చేయాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆలయాల డిప్యూటీ ఈవోలు, ఇతర అధికారులతో వర్చువల్ సమావేశం ( Virtual Meeting ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల సందర్శనకు వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ఆయా ఆలయాల స్థల పురాణం, దూరం, వీటికి సంబంధించిన సైన్ బోర్డులు (Signboards) ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆలయాల విశిష్టతపై వివిధ భాషల్లో సంక్షిప్త సమాచారం పొందుపరచాలన్నారు. ఇందుకోసం ఐటీ, పీఆర్వో విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. త్వరలో వెబ్సైట్లో ఆలయాల సమాచారం ( Information), సేవలు, దర్శన వేళలు (Darsan timinigs )ఆలయాల్లో భక్తులకు ఉన్న సదుపాయాలు, తదితర విషయాలను ఉంచాలని ఆదేశించారు. ఎస్వీ బీసీతో సమన్వయం చేసుకుని ఆలయాల సమాచారానికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తుల కనీస అవసరాలైన తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. నగరి, నారాయణవనం, బుగ్గ ఆలయాల కు టూరిజం బస్సులు వచ్చేలా ఆయా అధికారులతో చర్చించాలని వివరించారు. రిషికేష్, కురుక్షేత్ర, కన్యాకుమారి ఆలయాల అధికారులు కూడా ఆయా రాష్ట్రాల టూరిజం అధికారులతో మాట్లాడి ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసి యాత్రికుల బస్సులు ఆలయానికి వచ్చేలా చూడాలన్నారు. కొత్తగా నిర్మించిన రంపచోడవరం, సీతంపేట, జమ్ములాంటి ఆలయాల్లో భక్తుల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు.