తిరుపతి: పరిపాలన సౌలభ్యం, పరికరాలు, విభాగాలు డూప్లికేషన్ను నివారించడం, అనవసర ఖర్చులను నివారించడం కోసం అన్ని టీటీడీ దవాఖానాలను స్విమ్స్ పరిధిలోకి తీసుకురావాలని స్విమ్స్ యూనివర్సిటీ చైర్మన్, ఛాన్సలర్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుపతిలోని స్విమ్స్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విలీనం చేసే ఆసుపత్రులలో సిబ్బంది పంపిణీని సులభతరం చేసి.. బర్డ్ ఆసుపత్రి, రాబోయే శ్రీ పద్మావతి పీడియాట్రిక్ దవాఖానాలో పీజీ, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సులను పొందేందుకు వీలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి’శ్రీ వెంకటేశ్వర హెల్త్ యూనివర్సిటీ’గా నామకరణం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే, అంతర్జాతీయ సమగ్ర క్యాన్సర్ సంరక్షణ, పరిశోధనా కేంద్రాన్ని, శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీని త్వరలో స్థాపించనున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల వారికి సేవలను అందించేందుకు ప్రపంచ స్థాయి పునరావాస కేంద్రం స్విమ్స్ కొత్త క్యాంపస్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భారతీయ రోగులకు ఎక్సోస్కెలిటన్ వ్యవస్థ, మెడికల్ ఇంప్లాంట్లు కోసం డీఆర్డీఓతో స్విమ్స్ సహకరిస్తుందని ఆయన తెలిపారు.
ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో స్విమ్స్ అగ్రగామిగా నిలుస్తున్నదని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి అన్నారు. 2022-2025 నుంచి మూడేండ్ల కాలపరిమితికి ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ను పొందినట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా స్విమ్స్ అభివృద్ధికి టీటీడీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ బీ వెంగాయమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్నాతకోత్తర ప్రసంగం చేశారు. ఈ స్నాతకోత్సవంలో టీటీడీ జేఈఓ వీ వీరభ్రదం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ వైస్ఛాన్స్లర్ డాక్టర్ శ్యాంప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కేవీ శ్రీధర్ బాబు, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, డాక్టర్ వనజ, తదితరులు కూడా పాల్గొన్నారు.