ఇంటింటికీ తాగునీళ్లు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అ న్నారు. సోమవారం బడంగ్పేట, జల్పల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ కృష్ణా వాటర్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేశామన్నారు. అన్ని చోట్ల వాటర్ ట్యాంక్ల నిర్మాణ పనులు పూర్తి చేయడం ద్వారా వేసవిలోను నీటి సమస్య లేకుండా పోయిందన్నారు. కాలనీల్లో కొన్ని చోట్ల మాత్రమే పైపులైన్ పనులు జరుగుతున్నాయన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. భవిష్యత్లో ముంపు సమస్యను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారన్నారు.
త్వరలోనే నాలాల నిర్మాణ పనులు చేపడుతామన్నారు. అన్ని చెరువులను అనుసంధానిస్తూ నాలాల నిర్మాణ పనులు చేస్తున్నామన్నారు. ప్రధాన రహదారుల విస్తరణకు ఇప్పటికే నిధులు కేటాయించామని తెలిపారు. టెండర్ ప్ర క్రియ పూర్తి కాగానే రోడ్డు పనులు చేయనున్నట్లు తెలిపారు. నాలాలతో పాటు ట్రంక్ లైన్ పనులు పూర్తి అయితే డ్రైనేజీ సమస్య తీరుతుందన్నారు. డ్రైన్ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ కమిషనర్ కృష్ణ మోహన్రెడ్డి, కార్పొరేటర్ పెద్ద బావి శోభా ఆనంద్ రెడ్డి, సూర్ణ గంటి అర్జున్, రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు ,టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.