అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానం భక్తులను మోసం చేస్తుందని హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్వాహకుడు గోవిందానందా ఆరోపించారు. ఆదాయం పెంచుకునేందుకు హనుమంతుని జన్మస్థలం విషయంలో టీటీడీ గందరగోళం సృష్టిస్తుందని మండిపడ్డారు. ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో జన్మించలేదని, కర్ణాటక రాష్ట్రంలోని కిష్కింద పంపానది క్షేత్రంలోనే జన్మించారని వెల్లడించారు. రూ.1200 కోట్లతో కిష్కింద అభివృద్ధికి కర్ణాటక సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. హనుమంతుని జన్మస్థలం పేరుతో టీటీడీ నకిలీ పుస్తకం ముద్రించి అంజనాద్రి పేరుతో తిరుమలలో షాపులు నిర్మించి డబ్బులు సంపాదించాలని పాలకమండలి యత్నిస్తుందని ఘాటుగా విమర్శించారు.
సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. హనుమత్ జన్మతీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టామని ఈ రథయాత్న 12 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా పర్యటించి కిష్కింద హనుమంతుని జన్మస్థలమని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.