తిరుమల : పాతకాల్వ పేరూరు బండపై పునఃనిర్మించిన వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతున్నందున ఈ ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వకుళమాత ఆలయం చుట్టూ పేరూరు బండపై భక్తులకు ఆహ్లాదం కలిగించేలా పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అంగప్రదక్షిణ టోకన్లు రోజుకు 750 చొప్పున ఆన్లైన్లో విడుదల చేస్తున్నామని, అయితే దాదాపు 400 టికెట్ల వరకు మిగిలిపోతున్నాయని ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తుల్లో కొందరు రాలేక పోతున్నందున మిగిలిపోతున్నాయన్నారు. స్థానిక భక్తుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్లో మిగిలిపోయిన టికెట్లను ఆఫ్ లైన్లో కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తిరుపతిలో శ్రీనివాస సేతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ నాటికల్లా కరకంబాడి వైపు నుంచి వచ్చే మార్గంలో లీలామహల్ వద్ద వారధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ ఈఓ తెలిపారు. ఈ వంతెన పనులను డిసెంబర్ నాటికి మొత్తం పూర్తవుతాయన్నారు. ఎస్వీ మ్యూజియాన్ని దాతల సహకారంతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వసతులతో త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.