తిరుపతి : అలిపిరి నుంచి నడక మార్గం , వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు గోమాత దర్శనం చేసుకున్నాకే తిరుమల స్వామి దర్శనానికి వెళ్లేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. అలిపిరి వద్ద టీటీడీ నిర్మించిన సప్త గో ప్రదక్షణ మందిరం, వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీవారి పాదాల మండపాన్ని శుక్రవారం పరిశీలించారు .
గో దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడం శ్రేష్ఠమనే విషయం, గో పూజ విశిష్టతను భక్తులకు వివరించేలా తగినన్ని బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. గోప్రదక్షిణ మందిరం పరిసర ప్రాంతాలు మరింత పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు . అంతకు ముందు ఈవో ధర్మారెడ్డి టీటీడీ గో శాలను సందర్శించారు . అక్కడ జరుగుతున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ , నెయ్యి తయారీ కేంద్రం నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు .
డిసెంబర్ లోగా పనులు పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అగరబత్తుల తయారీ కేంద్రం పరిశీలించారు. ఉత్పత్తి పెంచడానికి అవసరమైన యంత్రాలు, సదుపాయాలు సమకూర్చుకోవాలని సూచించారు .