TTD | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో జే శ్యామల రావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం ఈవో, అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ శ్రీధర్తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డూతో పాటు తగ్గిన రూ.50 లడ్డూలు అందించడమే లక్ష్యమన్నారు. స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కోసం నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్లే భక్తులకు ఆధార్కార్డు ద్వారా రోజువారి రెండు లడ్డూలు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నదని, ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని, మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేనివారు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి, బయట ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తెలిసిందన్నారు.
అదేవిధంగా బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాల్లోనూ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందన్నారు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా భక్తులు దళారుల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుందన్నారు. తిరుమల లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహించే కార్పొరేషన్ సిబ్బంది భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించామన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ద్వారా టీటీడీ ఐటి వ్యవస్థ సహకారంతో గత 3 రోజులుగా, భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు ? దర్శనం చేసుకొని వారు ఎన్ని లడ్డూలు తీసుకొంటున్నారు ? తదితర విషయాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సీవీఎస్ఓ, జిల్లా ఎస్పీతో సంప్రదించి లడ్డూ దళారులను గుర్తించినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. లడ్డూ ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఈవో విజ్ఞప్తి చేశారు.