తిరుపతి : తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) పరిపాలనా భవనంలోని అన్ని రకాల రికార్డులను డిజిటైజ్ చేసి భద్రపరచాలని అధికారులను టీటీడీ ఎగ్జిక్యూటీవ్ అధికారి ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. టీటీడీకి చెందిన రికార్డులు భద్రపరిచే గదిలో 1933 నుంచి ఎన్నో రికార్డులు ఉన్నాయని, వీటినన్నింటినీ డిజిటలైజ్ చేయడం వల్ల భవిష్యత్లో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. టీటీడీ పరిపాలనా భవనంలోని రికార్డులు భద్రపరిచే గదులతో పాటు పలు కార్యాలయాలను బుధవారం ఆయన పరిశీలించారు. పాత ఓచర్లు, బిల్లులు, సర్వీస్ రిజిస్టర్లు ఇతర ఫైళ్లు భద్రపరిచిన విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. అవసరం లేని రికార్డులన్నీ తొలగించి కార్యాలయాల్లో వృథాగా ఉన్న ఫర్నీచర్ను వెంటనే డీపీడబ్ల్యు స్టోర్కు పంపాలని ఆదేశించామన్నారు. భవిష్యత్లో అవసరమయ్యే ఫైళ్లు అన్నింటినీ డిజిటైజ్ చేసి అవసరమైనపుడు పరిశీలించేందుకు అనుగుణంగా ఐటీ అప్లికేషన్ తయారు చేయాలని సూచించారు. మొత్తం సమాచారాన్ని టీటీడీ సర్వర్లో భద్రపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
పరిపాలనా భవనంలోని కార్యాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ఏసీఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, సీఏఓ శేషశైలేంద్ర, ట్రాన్స్పోర్టు జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈఓ గుణభూషణ్రెడ్డి, వీజీఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.