తిరుపతి : ప్రపంచ స్థాయి వసతులతో అభివృద్ధి చేసిన బర్డ్ ఆసుపత్రి(BIRRD Hospital) దేశంలోని అనేక క్లిష్టమైన సర్జరీలకు రెఫరల్ ఆసుపత్రిగా తయారైందని టీటీడీ ఈవో(TTD EO) ఎవి ధర్మారెడ్డి వెల్లడించారు. గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో శుక్రవారం బర్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ స్థాయి ఆర్థో ప్లాస్టీ సదస్సు(Ortho Plasty Summit)ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సమ్మిట్లో 10 నుంచి 12 దాకా మాత్రమే లైవ్ సర్జరీలు చేస్తుండగా బర్డ్ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న సమ్మిట్ లోనే 22 లైవ్ సర్జరీలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. దేశంలో పేరొందిన టాప్ 20 ఆర్థో సర్జన్లు ఇక్కడికి వచ్చి సర్జరీలు చేస్తున్నారని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది సర్జన్లు పాల్గొనడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి సమ్మిట్ లు సర్జరీల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగ పడతాయని ఆయన తెలిపారు.
బర్డ్ లో క్లిష్టమైన, అరుదైన ఆపరేషన్లే కాకుండా సెరిబ్రల్ పాల్సీ తో పాటు ఇతర క్లిష్టమైన ఆపరేషన్లు కూడా పేదలకు ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. సమ్మిట్ లో పాల్గొన్న సర్జన్లు కూడా బర్డ్ లో పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఇలా ఉచిత సేవ చేయడానికి ముందుకొచ్చే డాక్టర్లకు వసతి,రవాణా, భోజనం, తిరుమల స్వామివారి దర్శనం ఉచితంగా కల్పిస్తామని ఈవో చెప్పారు. బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి,డాక్టర్ ప్రదీప్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దీపక్, హిప్ రీప్లేస్ మెంట్ నిపుణులు, హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రి హెచ్ఓడీ డాక్టర్ కృష్ణ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ మార్టిన్ జిమ్మర్ మాన్ హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీలో నూతన పరిజ్ఞానం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.