Tirumala Laddu | శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం సరికాదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నిర్ధారణ లేని వీడియోలను ప్రచారం చేయవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
టీటీడీ ప్రతిరోజూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అత్యంత పవిత్రతతో, పరిశుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ భారీ స్థాయిలో తయారు చేసి భక్తులకు అందిస్తోందని తెలిపింది. లడ్డూ తయారీకి వినియోగించే ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ సార్టింగ్ మిషన్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో తనిఖీ చేస్తున్నట్లు పేర్కొంది. ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలోనూ టీటీడీ కఠినమైన ప్రమాణాలను పాటిస్తోందని వెల్లడించింది.
ఈ విధానంలో లడ్డూ తయారీలో వేరే పదార్థాలు కలిసేందుకు అవకాశమే ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులకు అందించే ప్రతి ప్రసాదం నాణ్యతగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది.
కొందరు వ్యక్తులు టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అపోహలు కలిగించేలా నిర్ధారణ లేని వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదని టీటీడీ పేర్కొంది. శ్రీవారి ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేసింది. భక్తులు ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలని సూచించింది. ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరింది.శ్రీవారి ప్రసాదాల పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతలను కాపాడటానికి టీటీడీ ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసింది.

Ttd Tirumala Laddu