తిరుపతి : తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన అడ్వాన్స్డ్ కార్డియాక్ క్యాథడ్రేషన్ ల్యాబ్ను టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్లోని వైద్యవ్యవస్థ పనితీరును డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ .. రెండు నెలల కాలంలో 16 ఓపెన్ హార్ట్ సర్జరీలను స్పెషలిస్టు డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారని అభినందించారు. ఆపరేషన్లు చేయించుకున్నవారిలో 25 రోజుల వయసు గల చిన్నారుల నుంచి 18 ఏళ్ల వరకు గల యువత ఉన్నారని, శ్రీవారి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ఇంకా 170 మంది చిన్నారులు ఆపరేషన్ల కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా అడ్వాన్స్డ్ కార్డియాక్ క్యాథడ్రేషన్ ల్యాబ్ను ఇక్కడ ఏర్పాటు చేశామని, ఇందుకోసం రూ.5 కోట్ల నుంచి 6 కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. ఈ ఆపరేషన్లు అన్నింటినీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నెలకు వంద ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, వైద్య సిబ్బందిని నియమించు కోవాలని ఆదేశించామన్నారు.
శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి చర్యలు ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, బర్ద్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి, సీఎస్ ఆర్ఎమ్వో శేష శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.