తిరుమల : తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియాన్ని ప్రపంచస్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ( TTD Chairman ) వెల్లడించారు. శుక్రవారం మ్యూజియం అభివృద్ధి పనులకు ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి పూజలు చేశారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన మ్యూజియాన్ని సందర్శకులను ఆకట్టుకునేలా ప్రపంచస్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేస్తామన్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహిమను, ఆలయ పురాతన సంప్రదాయాలు, సంస్కృతిని, చారిత్రక ప్రాముఖ్యతను యాత్రికులకు తెలియజేయడమే మ్యూజియం ప్రధాన లక్ష్యమన్నారు. యాత్రికులకు ఇక్కడ శ్రీవారి ఆలయ సందర్శన దివ్యానుభూతి పొందే విధంగా తయారు చేస్తామని స్పష్టం చేశారు. విరాళం ప్రాతిపదికన రూ.145 కోట్ల ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చినందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మ్యాప్ సిస్టమ్స్ సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.
మొత్తం 19 గ్యాలరీలు ఉన్నాయని, వాటిలో ఐదింటిని బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ (Map Systems) రూ.20 కోట్లతో , మిగిలిన 14 గ్యాలరీలను టీసీఎస్(TCS) రూ. 125 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాయని చెప్పారు. ఈ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో తిరువీధులు, తిరుమల ఆలయ అనుభూతి, వాహన సేవలు, స్వామివారి సేవలు, సప్తగిరుల గ్యాలరీలు ఉన్నాయని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వేంకటేశ్వరుడి రాతి విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, దారు విగ్రహాలు, అన్నమయ్య రాగి రేకులు, పురాతన నాణేల గ్యాలరీలు ఉన్నాయన్నారు.
మొదటి ఫ్లోర్ లో..
మొదటి ఫ్లోర్ లో శ్రీవారి ఆలయ శిల్పకళా వైభవం, భక్తాగ్రేసరులు- వారి సేవలు, యుద్ధ పరికరాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి గ్యాలరీలు వంటి అనేక అద్భుతాలు కొలువుతీరి భక్తులను అబ్బురపరిచేలా తీర్చిదిద్దుతామన్నారు. రెండవ ఫ్లోర్లో విరాట్ పురుషుడు, బ్రహ్మ, మహేశ్వరులు, ఋగ్వేదం యజుర్వేదం గ్యాలరీలు ఉన్నాయని, మూడో ఫ్లోర్లో బ్రహ్మాండ గ్యాలరీ కొలువై ఉందని చెప్పారు.
మ్యూజియం పైభాగంలో తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, పురందరదాస, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు వంటి భక్తాగ్రేసరులతో పాటు రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి మహాగ్రంథాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను ప్రదర్శిస్తామని వివరించారు.