తిరుమల : శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రేమతో సేవలు అందిస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశంసించారు. టీటీడీ వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణాలు, వైభవోత్సవాలు వంటి ధార్మిక కార్యక్రమాల్లో సనాతన ధర్మ రథసారథులుగా నిలుస్తున్నారని చెప్పారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు విచ్చేసిన శ్రీవారి సేవకులతో తిరుమల ఆస్థానమండపంలో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. శ్రీవారి భక్తులకు సేవలందించడం శ్రీవారి సేవకుల అదృష్టమన్నారు. భక్తులకు సేవలందించేందుకు 22 సంవత్సరాల క్రితం శ్రీవారి సేవను ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటివరకు దేశం నలుమూలల నుంచి 13 లక్షల మందికి పైగా సేవకులు పాల్గొన్నారని వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు ఏడు రాష్ట్రాల నుంచి 3,500 మంది సేవకులు వచ్చారని తెలిపారు. రానున్న కాలంలో అన్ని జిల్లాల నుంచి సేవకుల సంఖ్యను పెంచాలని సూచించారు. తిరుమలతోపాటు తిరుపతిలోని స్థానికాలయాల్లో కూడా సేవకులు సేవలందిస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్కుమార్, జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, వీజీఓ బాలిరెడ్డి, టీటీడీ ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టీ రవి, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పీ నీలిమ, శ్రీవారి సేవ ఏఈఓ శ్రీమతి నిర్మలతోపాటు పలువురు అధికారులు, శ్రీవారి సేవ సిబ్బంది పాల్గొన్నారు.