తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం మండలి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సోమవారం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కగార్ల గుడి వద్ద కొండ మీద నుంచి రోడ్డుపైకి జాలువారుతున్న వర్షం వల్ల కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందా అని పరిశీలించారు. ఆ ప్రాంతంలో నడిచి వస్తున్న పలువురు భక్తులతో ఆయన ముచ్చటించారు. నడక మార్గంలోని వసతులు, ఆన్లైన్లో దర్శన టికెట్ల లభ్యత తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాలాడి గుండం సమీపంలో కొండ చరియ మీద వర్షపు నీటి ప్రవాహం వల్ల వేర్లు బయటపడి కూలే స్థితిలో ఉన్న చెట్టును పరిశీలించి దాన్ని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలిపిరి వద్ద సప్త గో ప్రదక్షణశాలను పరిశీలించి ఫెన్సింగ్, ఆర్చిల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇక్కడ గోపూజ, గో ప్రదక్షణ చేసుకోవచ్చనే విషయం భక్తులకు తెలిసేలా ఇరువైపులా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. చైర్మన్ వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు.