TTD | తిరుమల శ్రీవారి సేవలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. సేవకులకు స్వామివారిని మరింత దగ్గర నుంచి దర్శించుకునే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. టీటీడీ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించి, తొందరలోనే దీనిపై అధికారిక నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు సేవలు అందించేందుకు పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన శ్రీవారి సేవకులతో ఆస్థాన మండపంలో బీఆర్ నాయుడు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్భాంధవులు అని అన్నారు. శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తుంటానని వెల్లడించారు.
దేశంలోని ఎంతోమంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని అన్నారు. వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అని పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తామని వ్యాఖ్యానించారు. శ్రీవారి సేవా విభాగం పదింతలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.