BR Naidu | డీప్ ఫేక్ వీడియోలతో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మహిళతో బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఆయన స్పందించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్ ప్రమాణం చేసిన తొలిరోజు నుంచే రాజీనామా చేయాలని అంటున్నారని తెలిపారు. వాళ్ల అవినీతి బండారం బయటకు వస్తుందనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో ఎన్నో స్కామ్లు జరిగాయని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ పవిత్రత దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే వాటిని బయటపెట్టడం లేదని పేర్కొన్నారు. భూమన, సుబ్బారెడ్డికి చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. మీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర నడవవని అన్నారు. సీఎం చంద్రబాబు సూచనతోనే ఇంతకాలం ఆగానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై లీగల్గా పోరాడతానని స్పష్టం చేశారు. ఏకసభ్య కమిషన్ విచారణ అంశం నుంచి డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని తెలిపారు. కరుణాకర్ రెడ్డి, జగన్ దోపిడీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసునని అన్నారు. టీటీడీ కోసం నేను నిస్వార్థంగా పనిచేస్తున్నానని బీఆర్ నాయుడు తెలిపారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో విహారయాత్రకు వెళ్లడంలో తప్పేముందని అన్నారు.
అంతకుముందు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా బీఆర్ నాయుడు స్పందిస్తూ..ఏఐ సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించేవిధంగా వీడియోలు తయారుచేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్టపాలు చేసుకునేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని బీఆర్ నాయుడు మండిపడ్డారు. ఏఐ సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించేవిధంగా వీడియోలు తయారుచేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనదని, వక్రీకరించినది పేర్కొన్నారు. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకమని వ్యాఖ్యానించారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అన్నారు.
వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని బీఆర్ నాయుడు మండిపడ్డారు. దీనిపై నేను చట్టప్రకారం ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తనపై సోషల్మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదని స్పష్టం చేశారు.