అమరావతి : విశాఖ మన్యం గ్రామాల్లో పనిచేస్తున్న కువి, కోదూ భాషా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, జీవో 3కు చట్ట బద్ధత కల్పించాలని కోరుతూ గురువారం ఆదివాసులు మన్యంలో బంద్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే నిరసనకారులు బస్సులు, ప్రైవేట్ వాహనాలను రోడ్లపై తిరగకుండా అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. అనేక నెలలుగా ఆదివాసీ వాలంటీర్లు చేస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నామని వారు వాపోయారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పాడేరు, హుకుంపేట స్టేషన్లకు తరలించారు.