తిరుపతి : తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణంలో పలు సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ పలు చర్యలు తీసుకుంటుంది.ఈ సందర్భంగా ఇవాళ తిరుమల ఘాట్రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సులను ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుపతి కేంద్రంగా వంద ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతుంది. వీటిలో తిరుమల నుంచి తిరుపతి మధ్య 50 బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
తిరుమలలో టీటీడీ రవాణా విభాగం వారం రోజుల పాటు ఎలక్ట్రిక్ బస్సుల ట్రయల్ రన్ను చేపట్టింది. ఎకోఫ్రెండ్లీ, జీరో హానికరమైన ఉద్గారాలను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీల ద్వారా అందించబడిన విద్యుత్తో నడిచే బస్సులను గత వారంరోజులుగా తిరుమలకు ఈ బస్సులను ట్రయల్ రన్ నడిపిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇంజిన్ పనితీరు, సిస్టమ్ నిర్వహణను డ్రైవర్ క్యాబిన్లో హ్యూమన్ టచ్ ఇంటిగ్రేటెడ్ డాష్బోర్డ్ ద్వారా పర్యవేక్షించవచ్చు.
ఏబీఎస్, పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ సిస్టమ్తో నడిచే అత్యంత అధునాతన డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్తో బస్సును తయారు చేశారు. బస్సులో షార్ట్ సర్క్యూట్, మెరుపు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మోడల్ ఆధారంగా 32 నుంచి 36 మంది ప్రయాణికులు కూర్చోడానికి వీలుగా, ఎల్ఈడీ లైటింగ్ ఎల్ఈడీ డిస్ప్లేలతో కూడిన బస్సు రేపటి వరకు ట్రయల్ రన్ నిర్వహించి త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్ని స్తున్నారు.
తిరుమలకు సాధారణ భక్తులతో పాటు నిత్యం వీఐపీ,వీవీఐపీలు, విదేశాల నుంచి సగటున 89,000 మంది యాత్రికులు, ప్రతి 24 గంటలకు 10,000 వాహనాలు ఘాట్ సెక్షన్ టోల్ గేట్ను దాటుతున్నాయి. తిరుమలలో స్వచ్ఛమైన నీరు, గ్రీన్ లైటింగ్, పరిశుభ్రత, హౌస్ కీపింగ్ కార్యక్రమాలతో సహా పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు రూ.25 కోట్లు కేటాయించింది.