అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు చెందిన జైలు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిని ఒంగోలు జైలు సూపరింటెండెంట్గా బదిలీ చేశారు. ఒంగోలు జైలర్ ప్రకాశ్ను కడప జైలు సూపరింటెండెంట్గా బదిలీ చేశారు. ఏపీ డీజీపీని బదిలీ చేసిన కొద్ది నిమిషాల్లోనే జైలర్ల బదిలీ ఏపీలో చర్చాంశనీయంగా మారింది.
టీడీపీ నాయకుడు చంద్రబాబు కడప జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిపై ఇటీవల చేసిన ఆరోపణల నేపథ్యంలో వరుణారెడ్డి బదిలీ జరగడం గమన్హారం. వరుణారెడ్డి అనంతపురం జైలు జైలర్గా ఉన్న సమయంలో పరిటాల రవీంద్ర హత్యకేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీనును అదే జైలులో బందీగా ఉన్న మరో నిందితుడు జైలులోనే దారుణంగా హతమార్చాడు. ప్రస్తుతం వరుణారెడ్డి కడప జైలు సూపరింటెండెంట్గా కొనసాగుతుండడం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితులు కూడా ఇదే జైలులో ఉండడం పట్ల టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
వివేకానంద రెడ్డి నిందితులకు ప్రాణరక్షణ లేదని చంద్రబాబు ఆరోపించారు. ఈ సమయంలో వరుణారెడ్డిని కడప నుంచి ఒంగోలుకు మార్చారని భావిస్తున్నారు.