అమరావతి : మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఏపీలోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు గాను స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు ఏడుగురు యువకులు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు గాను వారంతా గోదావరి నదిలో దిగారు. కొద్ది క్షణాల్లో నది ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మిగత వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలో భాగంగా పెద్దిరెడ్డి రామ్ప్రసాద్(18), షేక్ రుక్మల్(19) మృతదేహాలు లభ్యం కాగా ఓలేటి అరవింద్ (20) కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారు తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన వారిగా గుర్తించారు.