అమరావతి : ఏపీలోని దువ్వాడ రైల్వేస్టేషన్లో రైలు, ప్లాట్ఫాం మధ్య ఇరుక్కుని నరకయాతన అనుభవించిన విద్యార్థి ఉదంతం చివరకు విషాదంగా మారింది. గంటన్నరపాటు రెస్క్యూటీం శ్రమించి ఆమెను సురక్షితంగా బయటకు తీసినాగాని ప్రాణాలు దక్కలేదు. అంతర్గత గాయాల వల్ల ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందడం ఆమె కుటుంబంలో తీరని విషాదం నింపింది.
అన్నవరం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మెరపల బాబూరావు ఒక్కగానొక్క కుమార్తె శశికళ. అన్నవరం నుంచి దువ్వాడలోని ఎంసీఏ కళాశాలలో చదువుకునేందుకు ప్రతిరోజు రైలులో వెళ్లివస్తుంది. నిన్న గుంటూరు -రాయగఢ ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కి దువ్వాడ రైల్వేస్టేషన్లో దిగే క్రమంలో ప్రమాదం జరిగింది. రైలు కుదుపునివ్వడంతో తలుపు వద్ద నిలబడ్డ శశికళకు డోరు తగిలింది. దీంతో ఆమె జారిపడి రైలు, ప్లాట్ఫాం మధ్య ఇరుక్కుపోయింది.
దీంతో సహచరులు కేకలు వేయడంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని రెస్క్యూటీం సహకారంతో గంటన్నర పాటు శ్రమించి బయటకు తీశారు. ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయితే యూరిన్ బ్లాడర్ దెబ్బతినడం, ఎముకలు నలిగిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు అనేక రకాలుగా వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. గురువారం మధ్యాహ్నం చికిత్సపొందుతూ శశికళ మృతి చెందింది .