Srisailam | ఆషాడ పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో సోమవారం (03-07-2023) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంబరీ ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం సందర్భంగా ఆకు కూరలు, కూరగాయలు, వివిధ రకాల పండ్లతో శ్రీ భ్రమరాంబా దేవి మూల మూర్తిని, ఉత్సవ మూర్తిని, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారికి, అన్నపూర్ణాదేవి అమ్మవారికి, గ్రామ దేవత అంకాళమ్మ అమ్మవారికి అర్చకులు, వేద పండితులు శాకాలంకరణ, ఉత్సవ సంబంధ పూజాధికాలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల ఆకు కూరలతో అలంకరించారు. ఇందుకోసం వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలు తెప్పించారు.
వంగ, దొండ, బెండ, కాకర, చిక్కుడు, గోరు చిక్కుడు, మునగ, సొర, బీర, గుమ్మడి, బంగళాదుంప, కంద దుంప, క్యాప్సికమ్ (బెంగళూరు మిరప), క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి తదితర వివిధ రకాల కూరగాయలు, తోటకూర, పాలకూర, మెంతి కూర, చుక్క కూర వంటి ఆకుకూరలు, కరివేపాకు, కొత్తిమీర వంటి సుగంధ పత్రాలు, కమలాలు, బత్తాయి, ఆపిల్, అరటి, పనస తదితర పలు రకాల ఫలాలు, నిమ్మకాయలు, బాదంకాయలు, పచ్చి శనగలు తెప్పించారు.
ఈ ఉత్సవంలో భాగంగా ఆగమశాస్త్రానుసారంగా శ్రీభ్రమరాంబాదేవి వారికి ఉత్సవ సంబంధ పూజాధికాలు నిర్వహించారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు, వేద పండితులు ఉత్సవ సంకల్పం పఠించారు. సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతి వ్రుష్టి, అనావ్రుష్టి నివారించాలని, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలను నిరోధించి జనులంతా సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పం పఠించారు.
ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగేందుకు మహా గణపతి పూజ చేశారు. ఉత్సవంలో భాగంగానే శాకంబరీ దేవిగా అలంకరించిన అమ్మవారి ఉత్సవ మూర్తికి కూడా విశేషంగా షోడశోపచార పూజలు చేశారు.
పూర్వం హిరణ్యాక్షుడి వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్దానం చేశాడు. దీంతో యజ్న యాగాధులు నిలిచిపోయాయి. కరువు కాటకాలతో తీవ్ర క్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులంతా ఆది పరాశక్తిని గురించి తపస్సు చేశారు. వారి తపస్సుకు ప్రసన్నురాలైన ఆది పరాశక్తి.. లోక రక్షణ కోసం దుర్గముడిని సంహరించి, వేదాలు రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరించింది. ఈ సందర్భంగానే జగన్మాత తన నుంచి పలు రకాల ఆకు కూరలు, కూరగాయలు, ఫలాలు తదితర శాకాలను స్రుష్టించి క్షామాన్ని నివారించింది. ఇలా అవతరించిన అమ్మవారి స్వరూపమే శాకంభరీ దేవి.
ఆషాడ పౌర్ణమి నాడు అమ్మవారిని శాకాలతో అర్చించడం వల్ల అతి వ్రుష్టి, అనావ్రుష్టి నివారించి సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పాడి పంటలు బాగా పండుతాయని, కరువు కాటకాలు నివారించవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. లోక కల్యాణం కోసం ప్రతిఏటా ఎంతో శాస్త్రోక్తంగా అమ్మవారికి ఈ కైంకర్యం జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం అసిస్టెంట్ ఈవో ఎం హరిదాసు, పర్యవేక్షకురాలు సాయి కుమారి, అర్చక స్వాములు, వేద పండితులు పాల్గొన్నారు.