అమరావతి : నిన్న, మొన్నటి వరకు సామాన్యుడికి కంగారు పెట్టించిన టమాటా ధర నేడు నింగి నుంచి నేలకు దిగి వచ్చింది. టమాటా (Tomato) ధర ఒక్కసారిగా పడిపోవడంతో నంద్యాల (Nandyala) జిల్లాలో రైతులు టమాటాను రోడ్లపై పారబోస్తున్నారు. రెండు నెలల క్రితం కిలో టమాటా రూ.300 ధర పలుకగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలుకు శక్తి లేక టమాటా రుచికి కొన్ని రోజులు దూరంగా ఉన్నారు.
15 రోజుల నుంచి టమాటా ధర పతనం ప్రారంభం కావడంతో కిలో 20 నుంచి 30 రూపాయలకు ఒక్కసారిగా పడిపోయింది. తాజాగా గురువారం ఏపీలోని పలు జిల్లాలో టమాటాకు ధర లేక రోడ్లపై పారబోశారు. మరికొందరు పశువులకు మేతగా వేశారు . కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్, నంద్యాల జిల్లాలో రైతులు టమాటాను మార్కెట్కు తీసుకురాగా క్వింటాల్ టమాటాకు అరకొరగా వస్తున్న గిట్టుబాటు ధరను చూసి ఆందోళన వ్యక్తం చేశారు.
కనీసం రవాణా చార్జీలకు సరిపడ ధర రాకపోవడం ఎరువులు, పురుగుమందుల వంటి అదనపు ఖర్చులు భరించలేక పండిన పంటకు ధర రాక టమాటాలను రోడ్ల పక్కనే పారేశారు.