అమరావతి : టమోట పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన టమోట రైతులు క్లాక్ టవర్ వద్ద నిరసన తెలిపారు. పండించిన టమోట ను రోడ్లపై పారవేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులకు సబ్సిడీ వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయడం వల్ల నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు నెలల క్రితం 15 కిలోల టమోట బాక్స్ ధర వెయ్యి నుంచి 1500 వరకు పలకగా నేడు బాక్స్కు రూ. 40లు కూడా రావడం లేదని వాపోయారు. అనంతపురం జిల్లాలో సుమారు 15వేల హెక్టార్లలో టమోటను సాగు చేసిన రైతులకు ఈ యేడాది నష్టమే మిగిలిందని అన్నారు. టమోటను పండించే రైతులకు ఉద్యానవన శాఖ సబ్సిడీ ఇచ్చేదని, పంట నష్టపోతే పరిహారం ఇచ్చేవారని అన్నారు .
జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత సబ్సిడీలను ఎత్తివేయడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.