తిరుపతి : శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) ఏర్పాట్లు చేస్తుంది. ఈనెల 24, 25వ తేదీల్లో తిరుపతి (Tirupati), తరిగొండ ( Tarikonda) లో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మాతృశ్రీ వెంగమాంబ జన్మస్థలం తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామి (Laxminarasimha swamy) వారి ఆలయంలో గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం (Kalyanotsavam), అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో 24వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, 10 గంటలకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు, సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.