హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మిస్తున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ దవాఖాన దేశంలోనే అత్యుత్తమ దవాఖానగా తయారవుతున్నదనని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ దవాఖాన పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. దవాఖాన నిర్మాణం కోసం సేకరించిన భూమిలో ఉన్న రుయా ఆసుపత్రి క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్స వార్డును పరిశీలించి వీటిని తాతాలికంగా మరోచోటికి తరలించాలని రుయా అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్లో దవాఖానను ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. అనంతరం ఈవో తన కార్యాలయంలో దవాఖాన పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. జేఈవో సదాభార్గవి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ లక్ష్మణమూర్తి, చిన్న పిల్లల గుండె చికిత్సల దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ భరత్, ఈఈ కృష్ణారెడ్డి, రుయా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు తదితరులు పాల్గొన్నారు.