తిరుపతి : తిరుపతి(Tirupati )శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం చక్రస్నానంతో ఉదయం కార్యక్రమాలు ముగిశాయి. ఉదయం 6 గంటలకు శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, చక్రత్తాళ్వార్ ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ స్నపనతిరుమంజనం అనంతరం చక్రస్నానం నిర్వహించారు. అక్కడి నుంచి స్వామివారి మూర్తులను టీటీడీ పరిపాలనా భవనం ఎదుట గల పీఆర్ తోటలో విగ్రహాలను ఉంచారు .
సాయంత్రం 5 గంటలకు స్వామివారిని పీఆర్ తోట నుంచి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువస్తామని ఆలయ అధికారులు వివరించారు. రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల వరకు స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. రాత్రి 8.40 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయని వెల్లడించారు.