తిరుపతి: చెస్ ఒలింపియాడ్ టార్చ్కు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. విద్యార్థులు, ప్రజలు ఘనంగా స్వాగతించారు. టార్చ్ ర్యాలీ తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఐకానిక్ వేదిక మహతి ఆడిటోరియం వరకు కొనసాగింది. దారిపోడవునా వివిధ పాఠశాలల విద్యార్థులు బారులు తీరి నిల్చుండి టార్చ్కు స్వాగతం పలికారు. ఈ టార్చ్ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్, క్రీడాకారులు, ఎన్సీసీ కాడెట్స్ పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ ర్యాలీలో పాల్గొని విద్యార్థులు, క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ చెస్ క్రీడాకారులు , గ్రాండ్ మాస్టర్లు దేశ విదేశాలలో ప్రతిభ కనపరుస్తున్నారని, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి, గ్రాండ్ మాస్టర్ మునుసూరి రోహిత్, లలిత్ బాబు వంటి వారు మచ్చుతునకలు అని ఈ సందర్భంగా మంత్రి రోజా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. చివరగా చెస్ గ్రాండ్ మాస్టర్ ఆకాశ్కు ఒలింపియాడ్ టార్చ్ను మంత్రి రోజా అందించారు. ఇక్కడి నుంచి చెస్ ఒలింపియాడ్ టార్చ్ పుదుచ్చేరి వెళ్లనున్నది.
44వ ద్వైవార్షిక అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్కు ఈసారి భారతదేశం ఆతిథ్యం ఇస్తున్నది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 9 వరకు తమిళనాడు మహాబలిపురం పట్టణంలో ఈ మెగా టోర్నమెంట్ జరుగనున్నది. దేశంలోని పలు నగరాల్లో ఈ చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే నిర్వహిస్తున్నారు. టోర్నీ ప్రారంభమయ్యే నాటికి ఈ టార్చ్ మహాబలిపురం చేరుకుంటుంది.