తిరుమల: పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచి యున్నారని టీటీడీ ఆలయ అధికారులు వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 60,928 మంది భక్తులు దర్శించుకోగా 22,358 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.34 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.
టీటీడీ స్థానికాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు టీటీడీ స్థానికాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. డిసెంబరు 16వ తేదీ రాత్రి 12.34 గంటలకు ధనుర్మాసం ప్రారంభమవుతుందని, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 4 నుంచి 6 గంటల వరకు సుప్రభాతం స్థానంలో ఏకాంతంగా తిరుప్పావై పారాయణం, భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తామని చెప్పారు.
ఈ కారణంగా సుప్రభాతం సేవా టికెట్లు జారీ చేయబోమని , భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ ధనుర్మాస దర్శనం కల్పిస్తున్నామని అన్నారు.