Tirumala Vaikunta Dwara Darshanam | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆఫ్లైన్, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో 17 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న : వైకుంఠ ఏకాదశి టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు?
ఈవో : భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుని పారదర్శకంగా టోకెన్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టాం. త్వరలో వివరాలు తెలియజేస్తాం.
ప్రశ్న : దివ్యాంగుల దర్శనంలో సహాయకులను తీసుకొచ్చేందుకు అనుమతించండి? క్యూలైన్ లో వెయిటింగ్ లేకుండా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోండి?
ఈవో : దివ్యాంగులకు శ్రీవారి సేవకుల సహాయంతో దర్శనానికి వెళ్లే ఏర్పాటు ఉంది. భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు క్యూలైన్ల నిర్వహణ తప్పనిసరి.
ప్రశ్న : ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం సాధ్యపడటం లేదు?
ఈవో : లక్షలాది మంది భక్తులు దర్శనం టికెట్ల బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తిరుపతిలో రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ లో కోటా పెంచడం వీలు పడదు.
ప్రశ్న : ఆన్ లైన్ లో దర్శన టికెట్ల బుకింగ్ సమయంలో ఓటీపీ రావడానికి ఆలస్యమవుతోంది? దర్శన క్యూలైన్ లో సిబ్బంది తోసేస్తున్నారు.
ఈవో : భక్తుల సలహాలు, సూచనల మేరకు ఓటీపీ విధానం తీసుకురావడం జరిగింది. మీ సమస్యను పరిష్కరిస్తాం. దర్శన క్యూలైన్ లో భక్తులతో మెలిగే విధానంపై శ్రీవారి సేవకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం.
ప్రశ్న : మూడు నెలలు అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకునే విధానం ఇబ్బందిగా ఉంది? ప్రతిరోజూ టికెట్లు బుక్ చేసుకునే విధానం ఉంటే బాగుంటుంది?
ఈవో : భక్తులందరికీ ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ బుకింగ్ విధానం తీసుకురావడం జరిగింది.
ప్రశ్న : 2023లో ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ నియామకాలు జరగలేదు?
ఈవో : ఈ విషయం నా దృష్టికి వచ్చింది. 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాం.
ప్రశ్న : ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్ లైన్ కోట పెంచుతామన్నారు. ఎస్ఎస్ డి టోకెన్ తీసుకునేందుకు ప్రత్యేక లైను ఏర్పాటు చేయండి?
ఈవో : ఆన్ లైన్, ఆఫ్ లైన్ దర్శనం టోకెన్ల జారీపై టీటీడీ బోర్డు కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా భక్తులు నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.
ప్రశ్న : తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధుల పీఆర్వోలు అధిక రేట్లకు దర్శనం టికెట్లు అమ్ముతున్నారు కట్టడి చేయండి.
ఈవో : గౌరవ ప్రజాప్రతినిధులకు టీటీడీ ఈ సౌకర్యం కల్పించింది. కొంతమంది దళారులు డబ్బు తీసుకొని భక్తులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దళారులను నమ్మవద్దు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొంది స్వామివారిని దర్శించుకోండి.
ప్రశ్న : విద్య వైద్య రంగాలలో టీటీడీ చేస్తున్న కృషి అభినందనీయం, టీటీడీ ఆధ్వర్యంలో ఐ బ్యాంక్ స్థాపించండి, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో నేత్రదానం చేస్తారు.
ఈవో : తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఆరోగ్య సమస్యలు లేకుండా వైద్య సౌకర్యాలు అందిస్తుంది. శ్రీవారి భక్తులకు నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలిస్తాం.
ప్రశ్న : తిరుపతిలో ఎస్ఎస్ డి టోకెన్లు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇస్తున్నారు. దర్శనం టోకెన్లు ఉదయం ఇవ్వడం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఆన్ లైన్ లో శ్రీనివాస దివ్యనుగ్రహ హోమం బుక్ చేసుకో నేందుకు తల్లిదండ్రులకు మాత్రమే అవకాశం ఉంది. పిల్లలకు రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేయండి. వీఐపీల దర్శనాల సంఖ్య తగ్గించండి. టీటీడీ కాల్ సెంటర్లో ఉచితంగా సేవలు అందించే అవకాశం కల్పించండి.
ఈవో : ఎస్ఎస్ డి టోకెన్ల జారీ సమయం మార్పుపై కమిటీ పరిశీలిస్తుంది. హోమం టికెట్లు మొత్తం కుటుంబానికి కేటాయించే విషయం పరిశీలిస్తాం. వీఐపీలకు కేటాయించే దర్శన సమయం తక్కువ, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. శ్రీవారి సేవకురాలిగా కాల్ సెంటర్ లో సేవలు అందించేందుకు త్వరలో విధివిధానాలు రూపొందిస్తున్నాం.
ప్రశ్న : వయోవృద్ధులు దర్శనం టోకెన్లు పొందేందుకు ఆధార్ అప్లోడ్ చేసేలోపు టికెట్లు అయిపోతున్నాయి. దీనిని పరిశీలించగలరు.
ఈవో : భక్తులు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో వారి డేటా పొందుపరిచారు. టికెట్లు బుక్ చేసే సమయంలో మళ్లీ ఆధార్ అప్ లోడ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
ప్రశ్న : శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహించే మండపంలో ఒక చోట మాత్రమే తాగునీరు ఉంది. మరొకటి ఏర్పాటు చేయండి.
ఈవో : చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న : శ్రీవారి దర్శనం టికెట్లు పొందే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డులు బదులుగా ఆర్బీఐ సూచించిన యూపీఐ ద్వారా చెల్లించే సౌలభ్యం కల్పించండి.
ఈవో : ఐటీ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న : సప్తగిరి మాసపత్రిక నెల నెల రావడం లేదు.
ఈవో : సప్తగిరి మాస పత్రిక చందాదారులందరికీ ప్రతి నెల అందేలా చర్యలు తీసుకుంటాం.