హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీపావళితోపాటు వరుస సెలవుల నేపథ్యంలో వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. సోమవారం 70,902 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొన్నారు. వీరిలో 22,858 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. స్వామివారి హుండీకి రూ.3.24 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక, కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారు మంగళవారం గజవాహనంపై ఊరేగించారు. బుధవారం గరుడ వాహన సేవ ఉంటుంది. ఈ రెండు సేవల్లో అమ్మవారికి అలంకరించడానికి శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తిరుమల నుంచి తిరుచానూరుకు శోభాయాత్రగా తీసుకొచ్చారు.