తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు (Compartment) నిండిపోగా భక్తులు శిలాతోరణం (Shilatoranam) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. నిన్న స్వామివారిని 67,300 మంది భక్తులు దర్శించుకోగా 32,802 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ.3.83 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు.
16న డయల్యువర్ ఈవో
డయల్ యువర్ ఈవో(Dial your EO) కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని సూచించారు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.