తిరుమల : తిరుమల(Tirumala) ధర్మగిరి వేద పాఠశాలలో మంగళవారం సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం (Sundarakanda Parayanam) ప్రారంభమైంది. వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య దాదాపు 16 గంటల పాటు నిర్విరామంగా అఖండ పారాయణ యజ్ఞం కొనసాగనుంది. నాలుగు బృందాల్లో వేద పండితులు(Vedic scholars) ఈ శ్లోకాలను ఒక బృందం తరువాత మరొక బృందంగా పటించనున్నారు.
మొదట సంక్షిప్త రామాయణం నుంచి 100 శ్లోకాలు తరువాత సుందరకాండలోని శ్లోకాలు పారాయణం చేస్తున్నారు.ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కెఎస్ఎస్ అవధాని మాట్లాడుతూ సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ టీటీడీ(TTD) సంపూర్ణ అఖండ సుందరకాండ పారాయణాన్ని చేపట్టిందన్నారు. ‘ హనుమంతుడు సీతాదేవిని కలుసుకుని తిరిగి మహేంద్రగిరికి రావడానికి 16 గంటల సమయం పట్టిందని చెప్పారు.
సుందరకాండలోని 2,872 శ్లోకాలను 16 గంటల్లో పఠించడం ద్వారా అన్ని సమస్యల నుంచి, పాపాల నుంచి విముక్తి పొందుతామ’ ని పేర్కొన్నారు. రుత్వికులు పారాయణంతో పాటు ఏకకాలంలో యాగం కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశం నలుమూలలతోపాటు విదేశాల నుంచి సైతం భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్లోక పారాయణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ప్రముఖ పండితులు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాణిసదాశివమూర్తి, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ విభీషణ శర్మ, వేద పండితులు, విద్యార్థులు, భక్తులు సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.