తిరుమల : తిరుమల (Tirumala)లో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు(salakatla theppotsavam) మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనం ఇస్తారని వివరించారు.
రెండవ రోజు మార్చి 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో , 5,6 వ తేదీన శ్రీభూ సమేతంగా మలయప్పస్వామి(malayappa swamy) ఐదుసార్లు పుష్కరిణిలో తిరిగి దర్శనం ఇస్తారని అన్నారు. చివరి రోజు మార్చి 7న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో దర్శనం ఇస్తారని వివరించారు.
ఆర్జిత సేవలు రద్దు ..
తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు(ttd officials) వెల్లడించారు.