TTD | తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ నెల కోటాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం జూన్ 19న ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవ టికెట్లను జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవ వర్చువల్ సేవల కోటాను, వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్లను జూన్ 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. టికెట్ల బుకింగ్ కోసం www.tirupatibalaji.ap.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.